షర్మిలను చూసి జగన్ ఉద్వేగం: అఖిలపక్షంపై జిట్టాతో..
కాలి గాయంతో బాధపడుతున్న షర్మిల లోటస్ పాండు నుంచి కారులో చంచల్ గూడకు చేరుకున్నారు. వీల్ చైర్లో ఆమె వచ్చారు. అనంతరం జైలు వద్ద నుండి అతి కష్టం మీద నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. ఈ సమయంలో ఆమెను చూసిన జగన్ ఉద్వేగానికి లోనయ్యాడు. వైయస్ షర్మిల వీల్ చైర్లో వచ్చిందనే విషయం ఆయనను మరింత ఆవేదనకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణపై ఈ నెల 28న జరగనున్న అఖిల పక్షం, మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పైన జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె కాలి ఆపరేషన్ పైన మాట్లాడారు. ఆపరేషన్ పూర్తయి మూడు వారాలు రెస్టు తీసుకున్నాక పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
మరోవైపు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన నల్గొండ జిల్లాకు చెందిన నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి జైలులో జగన్ను కలుసుకున్నారు. తెలంగాణపై ఈ నెల 28న జరగనున్న అఖిల పక్ష సమావేశంలో అనుసరించనున్న వ్యూహంపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఆసుపత్రిలో చేరిన షర్మిల
మోకాలి నొప్పి శస్త్ర చికిత్స కోసం షర్మిల ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.