పిక్చర్స్: నాడు జగన్ యాత్ర, ఇప్పుడు సురేఖ కామెంట్
వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు మధ్య ఘర్షణ కొత్తది కాదు. వైయస్సార్ కాంగ్రెసు పార్ట నాయకురాలు కొండా సురేఖ తెరాసను ఎదుర్కోవడానికి చాలా కాలం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లాలో తెరాస ప్రాబల్యం ఎక్కువ. ఆ ప్రాబల్యాన్ని దెబ్బ తీస్తే తప్ప తమ బలాన్ని సుస్థిరం చేసుకోవడానికి వీలు కాదనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు కనిపిస్తున్నారు. దాంతో పరకాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తెరాసను దీటుగా ఎదుర్కునేందుకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని సురేఖ చేసిన వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసింది. తెరాస మహిళా విభాగం కార్యకర్తలు సోమవారం హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద ప్రదర్శన చేయడం, ఆత్మహత్యకు తనతో పాటు సిద్ధం కావాలని కెసిఆర్ చేసిన ప్రకటనలతో వాతావరణం మరింత వేడెక్కింది. తెరాస కార్యకర్తలకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మధ్య వరంగల్లో ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణ వాతావరణం కరీంనగర్ జిల్లాకు కూడా పాకింది. తెరాస కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై దాడి చేయడానికి ప్రయత్నించారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఓదార్పు యాత్ర తలపెట్టినప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబాబాద్ రైల్వే స్ఠేషన్లో పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్కు రైలులో బయలుదేరిన వైయస్ జగన్ను పోలీసులు మధ్యలో నల్లగొండ జిల్లా వంగపల్లి వద్ద అరెస్టు చేశారు.

గతంలో వైయస్ జగన్ తీవ్ర ఉద్రిక్త వాతావరణం మధ్య వైయస్ జగన్ రైలులో ఓదార్పు యాత్ర చేపట్టడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు. రైల్వే స్టేషన్లలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సాగారు. అయితే, ఆయన రైలు ప్రయాణానికి పలు చోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి.

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఆ రోజు రణరంగంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసు మద్దతుదారులకు, తెలంగాణవాదులకు మధ్య రాళ్ల సమరం సాగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు.

మహబూబాబాద్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైయస్ జగన్ను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ రకంగా ఓదార్పు యాత్రకు వరంగల్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణలోనే ఆటంకం ఏర్పడింది.

కొండా సురేఖ మాటలతోనే కాదు, చేతలతోనూ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రత్యర్థులపై మహబూబాబాద్లో సురేఖ రాళ్లు విసిరారు. ఈ సంఘటన అప్పుడు వివాదంగా మారింది.

కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని సురేఖ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. తెరాస మహిళా విభాగం కార్యకర్తులు సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో మంగళవారం వాతావరణం మరింతగా వేడెక్కింది. రేపు (బుధవారం) తెరాస వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications