సిఎం పథకాలు కావు, తొందరపడ్డారేమో: కిరణ్పై బొత్స
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ పార్టీవే తప్ప వ్యక్తులవి కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ పార్టీవేనని, ఎవరు సీఎంగా ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని.. ఆదివారం సదస్సులో కిరణ్ తన పథకం అని చెప్పడాన్ని గుర్తించానని, అది భాషా సమస్యే తప్ప ఇంకోటి కాదన్నారు. తెలంగాణ అమర వీరులను కించపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు.
సదస్సుకు హాజరు కాలేనని ముందుగానే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చెప్పారని, శాఖాపరమైన వ్యవహారంలో బిజీగా ఉన్నందున కిశోర్ చంద్రదేవ్, ఆరోగ్య కారణాల దృష్ట్యా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి హాజరు కాలేదని వివరించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసినందున సదస్సుకు తాను రాలేనని కావూరి సాంబశివ రావు చెప్పారన్నారు. అంతే తప్ప పార్టీపై అసంతృప్తి, ఇతర కారణాల వల్ల కాదన్నారు.
త్వరలోనే 3, 4 జిల్లాలను కలిపి 15 రోజులకోసారి సదస్సును నిర్వహిస్తామని, వాటిలో నేతల అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. సున్నితమైన తెలంగాణ, సమైక్య వాద అంశాల్లో ప్రజలందరి మనోభావాలను గౌరవిస్తామని, ఈ అంశంపై సత్వరమే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్న తీర్మానానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ కూడా చేతులెత్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఎవర్ని పంపాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. 108, 104 వాహనాలతోపాటు ఇతర సదుపాయాలకు 2005 నుంచి కేంద్రమే నిధులు ఇస్తోందని సత్తిబాబు చెప్పారు.