బిజెపి ఘోర ఓటమి: చేతికి చిక్కిన హిమాచల్ ప్రదేశ్
అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెసు హిమాచల్లో కేవలం 23 సీట్లే గెలుచుకుంది. ఇప్పుడు మాత్రం 13 సీట్లు ఎక్కువ దక్కించుకొని అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని సోనియా గాంధీ నిర్ణయిస్తారు. మరోవైపు 41 స్థానాలున్న బిజెపి కేవలం 26 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కాంగ్రెసుకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ గెలుపొందారు.
హిమాచల్ ప్రదేశ్లో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుందని.. కాంగ్రెసు గెలుస్తుందని సర్వేలు తెలిపాయి. అనుకున్నట్లుగానే ప్రభుత్వ వ్యతిరేకత హిమాచల్లో కనిపించింది. అధికార బిజెపికి అక్కడ షాక్ తగిలింది. ఈ రోజు మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.
కాగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్లో స్పందించిన విషయం తెలిసిందే. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు. మణి నగర్ నుండి పోటీ చేస్తున్న మోడీ ఆధిక్యంలో ఉన్నారు. అతని పైన కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా సస్పెన్షన్కు గురైన అధికారి భార్య శ్వేతా భట్ను బరిలోకి దింపారు. మణి నగర్లో మోడీ మంచి ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు.