ఢిల్లీ రేప్: చచ్చేవరకు దోషులను జైల్లో పెట్టండి
కేసు దర్యాప్తులో పోలీసులు మందకొడిగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ సంస్థల నుంచి కదలిక లేదని ఆరోపిస్తూ వివిధ వర్గాలకు చెందిన ప్రజలు రోడ్లెక్కారు. గ్యాంగ్ రేప్ నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరుతూ కొంత మంది పిల్లలు కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఢిల్లీ చైల్డ్ రైట్స్ క్లబ్ రాష్ట్రపతికి రాసిన లేఖపై దాదాపు 6 వేల మంది పిల్లలు సంతకాలు చేశారు.
గ్యాంగ్ రేప్ దోషులను చచ్చేంత వరకు జైల్లో పెట్టాలని ఆ లేఖలో పిల్లలు కోరారు. భద్రత లేకపోవడం తనకు భయాన్ని కలిగిస్తోందని అన్నారు. దుర్మార్గులు మహిళలను, పిల్లలను కూడా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన చైల్డ్ రైట్స్ క్లబ్ ఢిల్లీలోని లోథీరోడ్డులో సమావేశం ఏర్పాటు చేసి సమస్య తీవ్రతపై చర్చించింది. తమ, తమ మిత్రుల అనుభవాలను సమావేశంలో చర్చించుకున్నామని చెప్పారు.
ఈ ఏడాది ఢిల్లీలో మహిళలపై, అమ్మాయిలపై 631 రేప్ సంఘటనలు జరిగాయని తాము సమావేశంలో తమ సోదరులు, అక్కలు చెప్పగా విన్నామని వారు ఆ లేఖలో రాశారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన దోషులను జైల్లోని గదిలో జీవితాంతం బంధించి ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి రోజు వాళ్లు సిగ్గు పడేలా చేయాలని వారన్నారు.
ఈ సందర్భంగా పిల్లలు తమ లేఖలో నిఠారీ కేసులను గుర్తు చేశారు. చాలా మంది పిల్లలు లైంగికంగా, శారీరకంగా హింసకు, హత్యలకు గురయ్యారని చెప్పారు. కొంత మందిమి ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఆత్మరక్షణ తరగతులకు కూడా హాజరైనట్లు వారు తెలిపారు. దుర్మార్గుల గుంపు నుంచి ఓ వ్యక్తి తనను తాను రక్షించుకోవడం అంత సాధ్యం కాదని వారన్నారు.