వేడెక్కిన హస్తిన: ఢిల్లీలో రాష్ట్ర నేతలు, సిఎంకు పిలుపు

తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశంతో పాటు ధర్మాన వ్యవహారంపై కూడా చర్చించాల్సి ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం పెద్దలు పిలిపించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వచ్చేలోపే, అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చలు ప్రారంభించింది. రికాబ్గంజ్ మార్గ్లోని వార్రూంలో శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు కోర్ కమిటీ సభ్యులు హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్, ఆర్థిక మంత్రి చిదంబరం, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో రాహుల్గాంధీ చర్చలు జరిపారు.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను సమీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపైనే వారు చర్చలు సాగించారు. రాష్ట్రంలో సత్వర రాజకీయ మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని, తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని వారు భావించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలా, ప్యాకేజితో సరిపెట్టొచ్చా అనే విషయంపై చర్చలు జరిగాయి. ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా ఇతర వర్గాలను ఒప్పించడం ఎలా అనే విషయంపై కూడా చర్చ జరిగింది.
రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఏమైనా చేయాలా అన్న దిశగా కూడా చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఖరి ఎలా చెప్పాలన్న విషయంపై కూడా ముందుగానే చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. గవర్నర్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీలో ఉండటం, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా శుక్రవారమే హస్తినకు రావడంతో, ఇక ముఖ్యమంత్రి కూడా వస్తే అన్ని విషయాలపై స్పష్టంగా ఓ నిర్ణయానికి రావచ్చని అధిష్ఠానం భావించడమే ముఖ్యమంత్రికి పిలుపు రావడానికి కారణమని తెలుస్తోంది.
తెలంగాణపై జరిగే అఖిలపక్షానికి హాజరయ్యేందుకు ఇరు ప్రాంతాల నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో బొత్స ఇప్పటికే ఒక జాబితాను రూపొందించినట్లు సమాచారం. అధిష్ఠానంతో చర్చించి వీరిలో ఇద్దరు పేర్లను ఖరారు చేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా గవర్నర్ నరసింహన్ శనివారం ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications