తలుచుకుంటే అడ్రస్ ఉండదు: కెసిఆర్కు బాబు వార్నింగ్

గత తొమ్మిది రోజులుగా కరీంనగర్ జిల్లాలో సాగుతున్న బాబు పాదయాత్రకు ఆదివారంనాడు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరిగాయి. జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి శివారు వరకు ఆయన పాదయాత్ర సాగింది. జూబ్లీనగర్ వద్ద కొంత మంది తెలంగాణవాదులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెరాసపై, కెసిఆర్పై ఆయన నిప్పులు చెరిగారు.
తెరాస అందరి జీవితాలను నాశనం చేసిందని, తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్లోనూ వ్యతిరేకించబోనని మూడు నెలలుగా చెబుతూనే వస్తున్నానని ఆయన అన్నారు. తెరాస సమావేశాలకు తాము రావడం లేదని, అటువంటప్పుడు తెరాస కార్యకర్తలు ఇక్కడకు వచ్చి గొడవ చేయడం సమంజసమా అని ఆయన అన్నారు. "రాజకీయ దురుద్దేశంతోనే మీ నాయకుడు మిమ్మల్ని ఇక్కడకు పంపిస్తున్నారు. మేం తలుచుకుంటే మీ పార్టీ అడ్రస్ ఉండదు, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పట్టించుకుంటూ పరిష్కారం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నాయకుడిలా ఆరు నెలలకోసారి నిద్రలేచే వాడిని కాదు. మర్యాదగా వ్యవహరించాలి. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచి ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చేది. పరిస్థితి వేరేలా ఉండేది'' అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
తన పాదయాత్రలు జరుగుతున్న చోటుకు రావద్దని ఆయన తెరాస, బిజెపి కార్యకర్తలకు సూచించారు. తెరాస నేతలు ఏ సమస్య పరిష్కారం గురించీ ఆలోచించింది లేదని, పిల్లలను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా గెలువాలనే ఆశ తప్ప చేసిందేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పార్టీ అని, వైయస్సార్ కాంగ్రెసు జైలులో ఉండేపార్టీ'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా టీడీపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తున్నదని, తమ పార్టీని కాపాడుకోవల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications