సేమ్ సీన్!: హైకోర్టులో వైయస్ జగన్కు మళ్లీ భంగపాటు
వాన్పిక్ కేసులో తాము జగన్ను అరెస్టు చేశామని సిబిఐ కోర్టులో వాదించింది. తాము జగన్ను మే 27న అరెస్టు చేశామని, ఆగస్టు 14వ తేదిన వాన్పిక్ కేసులో ఛార్జీషీటు దాఖలు చేశామని చెప్పింది. అలాంటప్పుడు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్కు జగన్ అర్హుడు కాదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. అలాగే తాము మిగతా కేసుల్లో కస్టడీ పొడిగింపుకు అతనిని అడగలేదన్నారు. కాబట్టి అతను బెయిల్కు అర్హుడు కాదని సిబిఐ తెలిపింది.
దీంతో తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిందని, తనకు బెయిల్ ఇవ్వాలని స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. తాము కేసు మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని అయితే, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది.
సిబిఐ కోర్టులో స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ విషయంలో చుక్కెదురు కావడంతో జగన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అక్కడ కూడా ఈ రోజు భంగపాటు తప్పలేదు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విషయంలో కూడా సిబిఐ కోర్టులో జగన్కు చుక్కెదురయింది. దీనిపై అతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.