తెలంగాణకు టైం కాదు, జగన్ బచ్చా: సర్వే సంచలనం
2014 ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కెసిఆర్ చిల్లర కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. జైల్లో ఉన్న విమలక్క గురించి తెరాస ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రేపు తనను సంగారెడ్డిలో అడ్డుకుంటే జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదన్నారు. కెసిఆర్కు మజ్లిస్ పార్టీని తెలంగాణపై ఒప్పించే సత్తా, ధైర్యం, దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణకు రూ.10వేల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.
సర్వే సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలంగాణ ఇచ్చే సమయం కాదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం గుంటూరులో అన్నారు. కాంగ్రెసుకు అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇస్తే తెరాస లాభపడుతుందన్నారు. తెలంగాణ కంటే సీమాంధ్రనే వెనుకబడి ఉందన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లో అమరవీరుల త్యాగం వృధా కాదన్నారు.
కాంగ్రెసు పార్టీ ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ బచ్చా అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోయాక లక్ష్మీపార్వతి సభలకు భారీగా ప్రజలు వచ్చారని గుర్తు చేశారు. జగన్ సోదరి షర్మిల సభలకు కూడా ప్రజలు అలాగే వస్తున్నారన్నారు. లక్ష్మీ పార్వతికి పట్టిన గతే వైయస్ జగన్, షర్మిలలకు పడుతుందని సర్వే ధ్వజమెత్తారు.