అఖిలేష్ యాదవ్ కేబినెట్లో 26 మంది నేరచరితులే
అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లపై అధ్యయనం చేసిన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఎడిఆర్), జాతీయ ఎన్నికల నిఘా(న్యూ)లు ఆదివారం వివరాలు వెల్లడించాయి. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో 48 మంది మంత్రులు ఉండగా.. అందులో 26మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ నివేదికలు తెలియజేశాయి. వీరిలో కొందరిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం తదితర తీవ్ర అభియోగాల పైనా కేసులున్నాయని నివేదిక తెలిపింది.
ఈ నివేదికకను ఎడిఆర్ వ్యవస్థాపకులు త్రిలోచన్ శాస్త్రి, న్యూ రాష్ట్ర కన్వీనర్ సంజయ్ సింగ్లు విడుదల చేశారు. 26 మంది మంత్రుల్లో తొమ్మిది మందిపై రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, కేసులు ఉన్నాయని తెలిపారు. అమ్రోహా ఎమ్మెల్యే, టెక్స్టైల్ మంత్రి మహబూబ్ అలీ పైన 15 కేసులు ఉన్నాయి.
హత్యాయత్నం, కిడ్నాప్, రాబరీ కేసులు కూడా ఇతనిపై ఉన్నాయని తెలిపారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా పైన ఎనిమిది కేసులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అరవింద్ సింగ్ గోప్ పైన మూడు కేసులు ఉన్నాయని తెలిపారు.
అఖిలష్ మంత్రివర్గంలోని 48 మంది మంత్రుల్లో తాము కోటీశ్వరులమని 38 మంది తమ తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. నగీనా ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి కువార్ ఆనంద్ సింగ్ అత్యధిక ధనవంతుడుగా ఉన్నాడు. అతను రూ.18.3 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపాడు.
రాజా మహేంద్ర అరిదామన్ సింగ్ రూ.14.79 రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాను కేవలం రూ.4.85 కలిగి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. పిడబ్ల్యుడి మినిస్టర్ అయిన అఖిలేష్ మామ శివపాల్ యాదవ్ రూ.6 కోట్లు కలిగి ఉన్నారు.
పంచాయత్ రాజ్ మంత్రి బలరామ్ యాదవ్ అందరికంటే తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇతను రూ.16.31 లక్షలు కలిగి ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని మంత్రుల సరాసరి ఆస్తులు రూ.2.79 కోట్లుగా ఉన్నాయని శాస్త్రి, సింగ్ తెలియజేశారు.