జగన్ గెలిస్తే అణచేస్తాడట, పాతమన్ను కదలదు: కెసిఆర్
తెలంగాణపై 28న జరిగే అఖిలపక్ష భేటీతో గోల్మాల్ కావొద్దని, గందరగోళ పడొద్దని, అందులో బ్రహ్మ పదార్థమేమీ లేదని ఆయన అన్నారు. ''నూరు శాతం గ్యారంటీ ఇస్తున్నా... ఏ పాతమన్నూ కదలదు. చాట్ల తవుడు పోసి మళ్లీ కొట్లాట పెడుతున్నరు. దీంతో ఒరిగేదేమీ లేదు'' అని కెసిఆర్ అన్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించి మాట్లాడారు.
చాలా గూఢచారి సంస్థలు లేవని, ఏం జరుగుతుందో కేంద్రానికి తెలుస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ''సీఎం ఢిల్లీకి వెళ్లి వచ్చిండు. ఎందుకు వెళ్లాడు. ఏం బలుపా? ఉద్యమానికి ప్రాధాన్యం లేదట. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు మనల్ని ఆడిస్తుండ్రు. అఖిలపక్షంతో బెత్తిరీన్గా ఒక ఉపయోగం జరగబోతుంది. అన్ని పార్టీల రంగులు బయటపడతాయి'' అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినట్లే ఇచ్చి ఎండబెట్టిందని, మరో పార్టీ (టీడీపీ) రాత్రికి రాత్రి రాజీనామాల డ్రామా ఆడి అడ్డుకుందని, పార్లమెంటులోనే సమైక్యాంధ్ర జెండా పట్టుకుని జగన్ అడ్డుపడ్డాడని, వీళ్ల సంగతులు తెలియనివెవరికని మండిపడ్డారు. ఇంకా అఖిలపక్షమంటూ ఎవరిని మభ్యపెట్టడానికంటూ ధ్వజమెత్తారు. "డిసెంబర్ 23 ప్రకటన తర్వాత అదే రాత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లా. కిషన్రెడ్డిని, టీడీపీ నేతలను రప్పించా. అందరం రాజీనామా చేద్దామని చెప్పా. ఒకడు మీసాలు మెలేసిండు, మరొకడు తొడకొట్టిండు. తర్వాత ఎవడూ పత్తాలేడు. వచ్చిన తెలంగాణ మాయమైంది. ఎంతో మంది విద్యార్థులు చనిపోయిండ్రు. కేసీఆర్ చావడు, ఉద్యమాన్ని చావనివ్వడంటూ పార్టీలు ఆందోళన చెందాయి. కానీ, ఉద్యమాన్ని సాగిస్తూనే వస్తున్నాం. ఇదే మా వ్యూహం'' అని ఆయన అన్నారు..
నో ఆప్షన్. నో ఆల్టర్నేట్. నో కాంప్రమైజ్. భర్తృహరి చెప్పినట్లు... మనం నీచ మానవులమో, మధ్యములమో, ధీరువులమో తేల్చుకోవాలి. పిడికిలి బిగించి ముందుకు వెళదాం. సందర్భం వచ్చినప్పుడు అందరం ఐక్యమవుదాం. శషభిషలు వద్దు. మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ ముట్టడికి లక్షలాదిగా తరలివస్తరు. తడాఖా చూపిస్తం'' అని హెచ్చరించారు.