జగన్ బిజినెస్ చట్టబద్దం, కిరణే చెప్పారు: ఈడికి లాయర్
జగన్ ఆస్తుల అటాచ్మెంట్
జగన్ ఆస్తుల అటాచ్మెంట్ పైన ఢిల్లీలోని ఈడి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రా కోర్టులో తమ వాదనలు వినిపించాయి. క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జగన్ పబ్లిక్ సర్వెంట్ కాదన్నారు. 2009లో జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారని న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారమే అప్పుడు భూకేటాయింపులు జరిగాయని, అప్పటి ప్రభుత్వ విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.
జివోల జారీ వెనుక క్విడ్ ప్రోకో జరగలేదని స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే చెప్పారన్నారు. మంత్రులకు న్యాయ సహాయం కూడా అందిస్తున్నారని, జగన్ వ్యాపారాలు చట్టబద్దంగా చేస్తున్నారని, ఆస్తుల అటాచ్మెంట్ చట్ట వ్యతిరేకమని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. జగతి ఆస్తుల విలువ ప్రకారమే షేర్ విలువ రూ.350గా నిర్ణయించామని కానీ, ఈనాడు షేర్ విలువ రూ.5,28,630కి విక్రయించినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
విజయ సాయి రెడ్డి స్వయంగా హాజరయ్యారు. షేర్, ప్రీమియం విలువలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు స్వయంగా సమాధానం చెప్పారు. భూకేటాయింపులకు, జగతికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జగన్ ఆస్తుల కేసు అటాచ్ విచారణ జనవరి 1వ తేదికి వాయిదా పడింది.