ప్రపంచ తెలుగు సభలకు రాష్ట్రపతి: తెలంగాణ సెగ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి, మంత్రులు గల్లా అరుణకుమారి, వట్టి వసంతకుమార్, కె. పార్థసారథిలతో పాటు పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, శాసన మండలి సభ్యుడు వై. శ్రీనివాసులు రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఆర్వీ రమణమూర్తి గౌరవ అతిథులుగా హాజరువుతారు. సభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.
ప్రపంచ తెలుగు మహాసభలకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శ్రీవేంకటేశ్వర ప్రాంగణం సిద్ధమైంది. ఈ మహాసభల సందర్భంగా పలు అంశాల్లో ప్రముఖులు, నిపుణులు తమ పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు. కవి సమ్మేళనాలు ఉంటాయి. తెలుగు అకాడమీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచురించిన దాదాపు 120 లఘు పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. ఈ లఘు పుస్తకాలు రాసిన రచయితలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి పుస్తకాలను రూపొందించారు.
కాగా, తెలుగు మహాసభలకు తెలంగాణ రచయితల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. మహాసభలను బహిష్కరించాలని వివిధ తెలంగాణ సంఘాలు పిలుపునిచ్చాయి. మహాసభలను బహిష్కరించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) కూడా పిలుపునిచ్చింది. తెలుగు భాషోద్యమ సమితి కూడా సభల బహిష్కరణకు నిర్ణయం తీసుకుంది.