తెలుగుకు మంత్రిత్వ శాఖ: కిరణ్, శాస్త్రీయ భాష: ప్రణబ్

తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగును పాలన, బోధన భాషగా అమలు చేస్తామన్నారు. సంగీత, సాహిత్య, లలిత, నాటక అకాడమీలను తిరిగి ప్రారంభింప చేస్తామన్నారు. పివి నరసింహా రావు, నీలం సంజీవ రెడ్డి, బాలయోగి వంటి వారు దేశ రాజకీయాల్లో వెలుగొందారన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారని, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పింది గురజాడ అప్పారావు అన్నారు.
పిల్లలకు తెలుగు గొప్పతనం గురించి చెప్పాలని, ప్రాథమిక స్థాయి నుండి పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పని సరి చేస్తామన్నారు. తెలుగువాణి ప్రత్యేక సంచికలను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించి మొదటి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. తెలుగు సులభమైన భాష అన్నారు. తెలుగుకు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉందని, మాట్లాడటం ఎంతో సులభం అన్నారు.
శ్రీవారి చెంత మహాసభలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కవులు, చరిత్రకారుల పేర్లను గవర్నర్ స్మరించారు. సంగీత కళాకారులకు తెలుగు భాష అనువైనదన్నారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు రెండోది అన్నారు. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహ తొలగించాలన్నారు. మాతృభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. అది కుటుంబం నుండే ప్రారంభం కావాలన్నారు.
తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయమని రాష్ట్రపతి అన్నారు. తెలుగు సాహిత్యానికి మూల పురుషులు నన్నయ, తిక్కన, ఎర్రన అన్నారు. తెలుగు శాస్త్రీయ భాష అన్నారు.తెలుగు సాహిత్యం పురాతన కాలం నుండి వెలుగొందుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్యం అందమైనది. తెలుగులో ద్విపద, శతక సహా గొప్ప సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. 11 నుండి 14వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం.
తెలుగు పురాతన, శాస్త్రీయ భాష అన్నారు. తెలుగు కవులు, కళాకారుల పేర్లను ప్రణబ్ ప్రస్తావించారు. 2008లో తెలుగు శాస్త్రీయ భాషగా గుర్తింపు పొందిందన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి ఎందరో మహనీయులు పరిచయం చేశారన్నారు. కళా పూర్ణోదయం, ఆముక్త మాల్యద తెలుగులో కలికితురాయిలు అన్నారు. కన్యాశుల్కం మంచి సామాజిక కోణం నాటకమన్నారు. తెలుగులో కొత్త పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.
భాషలు మన వారసత్వ సంపదలన్నారు. ప్రాచీన భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. పరభాష నైపుణ్యంతో మాతృభాష అభివృద్ధికి, ప్రచారానికి కృషి చేయాలన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా పద్నాలుగు మంది విశిష్ట వక్తులను రాష్ట్రపతి సన్మానించారు.












Click it and Unblock the Notifications