ఎపి అలానే ఏర్పడింది: తెలంగాణపై టిజి వెంకటేష్
ఏకాభిప్రాయంతోనే సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ విడిపోవడానికీ అది అవసరమే అన్నారు. 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది అభిప్రాయాలు తెలుసుకోవడానికేనని చెప్పారు. హోంమంత్రి షిండే వ్యాఖ్యలను వ్యంగ్యంగా తీసుకోవడం సరికాదన్నారు. నెలలోపు తెలంగాణ ఇస్తామని ఆయన స్పష్టంగా చెప్పలేదని వివరించారు. తెలంగాణ నేతల తీరుతో ఆ ప్రాంతం ఇక్కట్ల పాలవుతోందని విమర్శించారు.
2014 వరకు తెలంగాణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నారు. ఆలోగా కొందరు తెలంగాణ నేతలు ప్రజలను రెచ్చగొట్టి నష్టాలకు కారకులతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ముందుకెళ్లే కొద్దీ అభివృద్ధి వెనక్కి వెళుతున్న అంశాన్ని గమనించాలన్నారు. ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇచ్చే అవకాశాలే ఉంటే కేసీఆర్ ఢిల్లీలో తమ పార్టీని విలీనం చేస్తానని అన్నప్పుడే జరిగేదన్నారు.
కాంగ్రెస్కు అన్ని పార్టీల మాదిరి డొంకతిరుగుడు వ్యవహారం చేతగాదని చెప్పారు. షిండేను 28వ తేదీ కన్నా ముందే కలిసి రాయలసీమ ప్రజల మనోభావాలను వినిపించామని టిజి వెంకటేష్ అన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు బల ప్రయోగంతో తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తే కటకటాలు తప్పవన్నారు. తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ కాంగ్రెస్సేనని.. అదీ ఏకాభిప్రాయం కుదిరినప్పుడేనని వివరించారు.
మజ్లిస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి మతతత్వంతో అధికారం కోరుకునే పార్టీ అని టిజి వెంకటేష్ ధ్వజమెత్తారు. తెలంగాణ అంశం కేవలం రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదన్నారు. మజ్లిస్ పార్టీ ప్రతిపాదించిన రాయల తెలంగాణ అభిప్రాయానికి తాము వ్యతిరేకమని టిజి వెంకటేష్ చెప్పారు.