నాపై ఫైరయ్యారు: బాబు తెలంగాణ వైఖరిపై బొత్స వ్యాఖ్య
తెలంగాణపై అఖిల పక్ష సమావేశం పెట్టిన తర్వాత తనపై గతంలో విరుచుకుపడిన సీమాంధ్ర నాయకులంతా ఏమయ్యారని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీని ఆ సీమాంధ్ర నేతలంతా ఎందుకు తప్పు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర పడుతుందని ఆయన అన్నారు.
తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హాజరు కావడానికి వీలు కానందు వల్లనే విజయవాడ పార్టీ ప్రాంతీయ సదస్సు రద్దయిందని ఆయన చెప్పారు. ప్రాంతీయవాదంతో ఈ నెల 7వ తేదీన జరగాల్సిన సదస్సు రద్దుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ఈ సదస్సును నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆజాద్ చెప్పడం వల్లనే ప్రాంతీయ సదస్సును రద్దు చేసుకున్నామని ఆయన అన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. మతపరమైన వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన సూచించారు. లక్ష్మణ రేఖ దాటిన ఎవరిపైన అయినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆనయ అన్నారు.