ప్లీజ్ శాంతించండి: భారత్ ను వేడుకున్న పాకిస్థాన్..!
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదకరమే.. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకల్ని హతమార్చింది. ఈ ఘటనల తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాజాగా పాకిస్థాన్ కు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ కీలక వార్నింగ్ ఇచ్చారు.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వారిని భారత్ పైకి ఉసిగొల్పితే ఈసారి మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ ఈ భూగోళంలో ఉండాలా..? లేదా చరిత్రలో మిగిలిపోవాలా..? అనే విషయాన్ని వారే తేల్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పూర్తి క్లారిటీతో ఉందని ఏ రూపంలో వచ్చినా అణచివేతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అయితే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించింది. భారత్ శాంతియుతంగా కలిసి జీవించడం నేర్చుకోవాలని కోరింది. భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభివర్ణించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు వ్యూహాత్మక సంయమనం, పరిణతి, హుందాతనాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. పాకిస్థాన్ ను భూగోళం నుంచి తొలగిస్తామనే బెదిరింపులు మానుకోవాలని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ తో శాంతియుతంగా జీవించాలని కోరింది.
అంతేకాక పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని ఎలాంటి చర్యలకు దిగినా దాని పరిణామాలు కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితం కావని అవి భారత్ కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా ఏమాత్రం జీర్ణించుకోలేని విధంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాసియాను మరో సంక్షోభం, యుద్ధం వైపు నెట్టే ప్రయత్నాలు చేయొద్దని దానివల్ల వచ్చే నష్టాలు ఈ ప్రాంతం మొత్తానికి వినాశకరంగా మారతాయని పాకిస్థాన్ పేర్కొంది.

ఇక పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్,అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.












Click it and Unblock the Notifications