తిరుమలలో పచ్చదనం పరవళ్లు
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమల.. నూతన అందాలను సంతరించుకుంటోంది. ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారు కొలువుదీరిన అత్యంత పవిత్ర శేషాచలం అడవులు అంతకంతకూ విస్తరిస్తూ వస్తోన్నాయి. జీవ వైవిధ్యానికి, అనేక వన్యప్రాణుల ఆవాసం నిలిచాయి ఇక్కడి అడవులు. వాటిని పరిరక్షించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటోన్న చర్యలు దీనికి ప్రధాన కారణాలు.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక..
టీటీడీ అటవీ విభాగ పరిధిలో మొత్తం 2,719 హెక్టార్ల విస్తీర్ణంలో అరణ్య ప్రాంతం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ (ISF) నివేదిక ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదు కావడం విశేషం. ఇది దేశంలోనే అత్యుత్తమం. టీటీడీ అటవీ విభాగాన్ని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్లు ఉన్నాయి.

24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్..
ప్రతి రేంజ్ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది సమన్వయంతో అటవీ పరిరక్షణ చేపడుతున్నారు. అటవీ సంపద సంరక్షణలో భాగంగా 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం పహారా నిర్వహిస్తూ అక్రమ చెట్ల నరికివేత, వేట చర్యలను అరికడుతున్నాయి. అటవీ అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫైర్ లైన్లు నిర్వహించడంతో పాటు శిక్షణ పొందిన బృందాలు వేగంగా స్పందించి 100 శాతం వరకు అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి.
జీవ వైవిధ్య పరిరక్షణ..
జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విదేశీ జాతికి చెందిన అకేషియా చెట్ల స్థానంలో స్థానిక వృక్ష సంపదను పునరుద్ధరించే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ఈ మేరకు 576 హెక్టార్లలో స్థానిక జాతులైన రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి, గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి మొక్కలను దశలవారీగా నాటుతున్నారు. ఇప్పటివరకు 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి.
మానవ- వన్యప్రాణి ఘర్షణ నివారణకు..
శేషాచల అడవుల్లో ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. మానవ- వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు, గాయపడిన జంతువులను రక్షించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్స్ ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపుతోంది. దీంతో నీటి కోసం అడవి జంతువులు మానవ ప్రాంతంల్లోకి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గింది.
పచ్చదన అభివృద్ధి..
తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు, ఉద్యానవనాలు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది. అరుదైన, ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ, ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కూడా సరఫరా చేస్తోంది.
భావి తరాలకు ప్రకృతి వారసత్వం..
ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పాలమనేరు టింబర్ ప్లాంటేషన్, వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం, కొండల పచ్చదనం పెంపు వంటి పలు కీలక ప్రాజెక్టులను టీటీడీ ఫారెస్ట్ విభాగం అమలు చేస్తోంది. పవిత్ర అరణ్య సంపదను సంరక్షించడం ద్వారా భావి తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడం టీటీడీ అటవీ విభాగం ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది.












Click it and Unblock the Notifications