అరెస్ట్ చేయొచ్చు: అక్బర్పై స్పీకర్, నారాయణ ఝలక్
అక్బరుద్దీన్ వ్యవహారంపై తనకు పలు ఫోన్లు వచ్చాయని, మెయిల్స్ కూడా చాలా వచ్చాయన్నారు. దానిపై ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ కౌన్సిల్లో 12 స్టాండింగ్ కమిటీలు ఉన్నాయని చెప్పారు. సభ్యులు బయట సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. అక్బరుద్దీన్ విషయం తన దృష్టికి చాలా మంది తీసుకు వచ్చారన్నారు. కేసు సమాచారం అందలేదన్నారు. టిడిపి ఎమ్మెల్యే యరపతినేని సమాచారం కూడా అందలేదన్నారు.
అక్బరుద్దీన్ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలా వద్దా అనే విషయాన్ని ఇంకా ఆలోచించలేదన్నారు. రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత అనంతపురం జిల్లా ఎస్పీ వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. పూర్తి సమాచారాన్ని 48 గంటల్లో ఇవ్వాలని ఎస్పీని ఆదేశించానని చెప్పారు. నివేదిక వచ్చాక చూసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
అక్బరుద్దీన్ పై సిపిఐ ఫైర్
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ తీరు సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన ఓ ఉగ్రవాదిలా మాట్లాడాడని విమర్శించారు. అక్బరుద్దీన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. సోనియా గాంధీ మొట్టికాయలు వేస్తారనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలకు వెనుకాడుతున్నారన్నారు.
బిజెపి, సిపిఎం, తెరాసలకు నారాయణ షాక్ ఇచ్చారు. జ్యోతిష్యాలయం పెట్టుకోవాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుకు కౌంటర్ ఇచ్చారు. రాఘవులు తనకు మంచి సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. లెనినిజం, మార్క్జిజం భవిష్యత్తునే చెబుతాయన్నారు. బిజెపితో పొత్తు మీడియాలో చూశానన్నారు. అది సాధ్యం కాదన్నారు. బిజెపితో కలిసి తాము ఎప్పుడూ ఒకే వేదికపై పని చేయలేదన్నారు. అది ముందు కూడా కుదరదన్నారు.
సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంటామని నారాయణ చెప్పారన్న టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యల పైనా స్పందించారు. తెలంగాణలో, ఆంధ్రాలో పొత్తుల కోసం తాము ఎప్పుడూ రెండు కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. పొత్తులపై తాను నాయినితో ఎప్పుడూ చర్చలు జరపలేదన్నారు. తెలంగాణ కోసం ఈ నెల 19న, విద్యుత్ విధానానికి నిరసనగా ఈ నెల 22న జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన తెలుపుతామన్నారు.
అనారోగ్యం పేరుతో నాటకాలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని సిపిఐ ఎమ్మెల్యే గూండా మల్లేష్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు సెక్యులరిజానికి వ్యతిరేకమన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసదుద్దీన్ తన సోదరుడు అక్బర్ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదని అజీజ్ పాషా ప్రశ్నించారు.