హేట్ స్పీచ్: అక్బరుద్దీన్ అరెస్టు, ధ్రువీకరించిన ఐజి

గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల ప్రాంతంలో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చారు. ఈ సమయంలో మజ్లీస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్బరుద్దీన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మంగళవారం ఉదయం నుంచి అక్బరుద్దీన్ అరెస్టు విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు వెంకటేశ్వర రావు చెప్పారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసి పరిస్థితి, పరిణామాలను వివరించారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
గాంధీ ఆస్పత్రికి తరలించడానికి ముందు మజ్లీస్ అధినేత, సోదరుడు అక్బరుద్దీన్ నివాసానికి వచ్చారు. దాదాపు గంట సేపు అక్బరుద్దీన్తో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ మీడియాపై రుసరుసలాడారు. తాను నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని అక్బరుద్దీన్ గడువు కోరారు. అయితే, అక్బరుద్దీన్ చూపిన ఆరోగ్యకారణాలను ధ్రువీకరించుకోవడానికి పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హెర్నియా బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అక్బరుద్దీన్కు వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు నివేదికను అందించారు. పొట్ట కింది భాగంలో అక్బరుద్దీన్కు హెర్నియా ఉందని, దానివల్ల ఆయన ఎక్కువ దూరం నడవలేరని నివేదికలో తేలింది.
అక్బరుద్దీన్ తొడలో బుల్లెట్ ఉందని వైద్యులు చెప్పారు. గతంలో జరిగిన దాడిలో అతని తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అది అలాగే ఉంది. కాగా, ఆయన ఎడమ ముంజేతి ఎముకకు గాయం ఉన్నట్లు నివేదికలో తేలింది. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పారు. మజ్లీస్ కార్యకర్తలు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. టిఫిన్ కూడా అందించకుండా అక్బరుద్దీన్ను వేధిస్తున్నారని అక్బరుద్దీన్ తరఫు న్యాయవాది ఆరోపించారు.












Click it and Unblock the Notifications