హత్య కేసులో టిడిపి ఎమ్మెల్యే యరపతనేని అరెస్టు
హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వలవేసి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పిడుగురాళ్లకు తరలించారు. నరసరావుపేట కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఎమ్మెల్యే యరపతినేని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో 7వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 9వ తేదీ బుధవారం విచారణకు రానుంది.
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే లోగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు వార్త తెలిసి పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండల కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం గురజాల నియోజకవర్గ బంద్కు తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు.
హత్యకు గురైన నరేంద్ర తొలుత తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి మారారు. రియల్ ఎస్టేట్ వివాదాలు, క్రికెట్ బెట్టింగ్ల నేపథ్యం గల నరేంద్ర నవంబర్ 27న హత్యకు గురయ్యారు. తన అన్నను హత్య చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని కుట్ర పన్నారని నరేంద్ర సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను మూడో నిందితుడిగా చేర్చారు.
గుంటూరు జిల్లా పల్నాడులోని గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ ప్రాంతం ఫాక్షన్ రాజకీయాలకు నిలయం. 1994లో తొలుత ఎమ్మెల్యేగా గెలుపొందారు.