అసలుకే ఎసరు పడింది: పంత్ అవుట్.. కేఎల్ రాహుల్ ఇన్?
భారతజట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు కేరీర్ ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ వైఫల్యాలు అతని కొంపముంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథ్యాన్ని వహిస్తోన్న పంత్ ఫామ్ కోల్పోయాడు. జట్టును ముందుకు నడిపించలేకపోతున్నాడు. కేప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గానూ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఇది.. ఏకంగా జాతీయ జట్టులో అతని స్థానానికి ఎసరు పెట్టింది.
టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుండి పంత్ను తప్పించే అంశాన్ని బీసీసీఐ సెలెక్టర్లు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తోన్నాయి. అదనపు బాధ్యతలు అతని బ్యాటింగ్, నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారం జరిగే సెలెక్షన్ కమిటీ భేటీలో అతని భవిష్యత్ ఏమిటనేది తేలిపోనుంది.
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగిన తర్వాత శుభ్మాన్ గిల్ను ఈ ఫార్మాట్లో కెప్టెన్గా నియమించారు. అదే సమయంలో.. రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. టీమిండియా వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్ నాయకత్వ పటిమపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాయకత్వ బాధ్యతలు పంత్ సహజమైన ఆటను ప్రభావితం చేస్తున్నాయని సెలక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రిషబ్ పంత్ వంటి మ్యాచ్ విన్నర్ జట్టుకు అవసరమే అయినప్పటికీ.. అతనికి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రతిసారీ విఫలమౌతున్నాడని బీసీసీఐ భావిస్తోంది. బ్యాటింగ్, వైస్ కేప్టెన్ గా తీసుకునే నిర్ణయాలపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ఐపీఎల్ వైఫల్యాలు దీనికి ఉదాహరణగా పేర్కొంటోంది బీసీసీఐ. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన దూకుడు ఆటపైనే పంత్ దృష్టి సారించాలని సెలెక్టర్లు కోరుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
శుభ్మన్ గిల్ అందుబాటులో లేని కారణంగా రిషబ్ పంత్ గత ఏడాది నవంబర్ లో గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మొదటిసారి భారత కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పుడే రిషభ్ పంత్ కెప్టెన్సీ, అతను తీసుకున్న నిర్ణయాలపై వరుసగా విమర్శలు వెల్లువెత్తాయి.
2025లో రిషబ్ పంత్ ఏడుె టెస్ట్ మ్యాచ్లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్తో ఆడిన రెండు గొప్ప ఇన్నింగ్స్లను మినహాయిస్తే, మిగతా మ్యాచ్లలో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ సిరీస్లో అతని స్కోర్లు 27, 2, 7, 13.
రిషబ్ పంత్ నుండి వైస్ కెప్టెన్సీని తొలగిస్తే, కేఎల్ రాహుల్ టీమ్ మేనేజ్మెంట్కు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. రాహుల్ గతంలో కూడా జట్టుకు కెప్టెన్గా ఉన్న అనుభవం ఉంది. టెస్ట్ జట్టులో అతని స్థానం దాదాపు ఖాయమైనట్టే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం గువాహటి సమావేశం కానుంది. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్కు జట్టును ఎంపిక చేయడంతో పాటు, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications