యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన
యూపీఐ చెల్లింపులపై ఛార్జీల గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాధారణ ప్రజలకు, వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు పూర్తి ఉచితంగానే కొనసాగుతాయని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. భవిష్యత్తులో పరిమిత సంఖ్యలో ఉండే పెద్ద వ్యాపార లావాదేవీలకు మాత్రమే నామమాత్రపు 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' ప్రవేశపెట్టే ఆలోచన ఉందని.. సాధారణ వ్యక్తి నంచి వ్యక్తికి జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుము ఉండదని తేల్చి చెప్పింది.
చట్ట సవరణల వెనుక అసలు ఉద్దేశం
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లును లోక్ సభలో ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సవరణల వల్ల ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు అకౌంట్లకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకూ ఛార్జీలు వర్తించవు. ఈ సవరణల ఆధారంగా ఎన్పీసీఐ నేతృత్వంలోని కమిటీ భవిష్యత్తులో మర్చంట్ ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటుంది.

ప్రభుత్వం ప్రకారం.. ఒకవేళ ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలను ప్రవేశపెడితే అవి ఓ నిర్దిష్ట పరిమితికి మించిన పరిమిత వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ ఛార్జీలు నామమాత్రంగా ఉంటాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు వర్తించే ఎండీఆర్ కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎండీఆర్ను ప్రవేశపెడితే, అది పరిమితి ఆధారితంగా ఉంటుందని, అన్ని UPI లావాదేవీలకు గుడ్డిగా వర్తించదని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ విధానంపై విదేశీ లేదా బాహ్య ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది.
రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు
2016లో ప్రారంభమైన యూపీఐ నేడు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. 2026 జులై ఒక్క నెలలోనే యూపీఐ ద్వారా రూ.29.9 లక్షల కోట్ల విలువైన రూ.2,366 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో యూపీఐ సురక్షితంగా, సుస్థిరంగా కొనసాగేందుకే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని, అనవసర పుకార్లు నమ్మవద్దని పౌరులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.




Click it and Unblock the Notifications