అక్బర్ ఇష్యూ: డైలమాలోనే జగన్, తెరాసపైనా మౌనం

తెరాస ఆరోపణలపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్దగా నోరు విప్పడం లేదు. అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగం, తెరాస ఆరోపణల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు అయోమయంలో పడినట్లు కనిపిస్తున్నారు. మజ్లీస్పై కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పైనే హరీష్ రావు, కెటి రామారావు వంటి తెరాస నాయకులు వాగ్బాణాలు సంధిస్తున్నారు.
తెరాసను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అక్బరుద్దీన్ వ్యవహారంపై మాట్లాడకున్నా, తెరాస వ్యాఖ్యలను ఖండించడానికి వారికి వీలుంది. అయినా, వారు నోరు విప్పకపోవడంలోని ఆంతర్యం ఏమిటనేది అర్థం కావడం లేదు. తెరాసపై ఒంటి కాలి మీద లేచే కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి నాయకులు ప్రతిస్పందించడం లేదు.
తెరాసపై నిప్పులు చెరిగే కొండా సురేఖ కూడా గొంతు విప్పడం లేదు. కొండా సురేఖ జగన్ పార్టీకి దూరమైనట్లు కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే, మిగతా నాయకులు ఎందుకు మాట్లాడడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. వైయస్ జగన్ నుంచి సరైన దిశ లేకపోవడం వల్ల వారు మాట్లాడడం లేదా, వేచి చూసే ధోరణితో వ్యవహరించాలని అనుకుంటున్నారా అనేది తెలియడం లేదు.
నిజానికి, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఎక్కడి నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావడం లేదు. ఈ వ్యవహారంలో వేలు పెడితే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నారా అనేది కూడా సందేహంగానే ఉంది. ఏమైనా, అక్బరుద్దీన్ వ్యవహారం వైయస్సార్ కాంగ్రెసు ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications