ఎన్టీఆర్లా మా నాన్న: లోకేష్, జైలు నుంచే జగన్: బాబు

ముప్పయి ఏళ్ల కిందట ఇదే రోజున 'అన్న'గారు (ఎన్టీఆర్) అధికార పగ్గాలు చేపట్టారని, వస్తున్నా మీ కోసం పాదయాత్ర ద్వారా నాన్న (చంద్రబాబు) కూడా పార్టీని అధికారంలోకి తెస్తారని లోకేష్ ట్వీట్ చేశారు. ముప్పయ్యేళ్ల కింద 1983 జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. నాడు టీడీపీ స్థాపనకు ముందు ఉన్న పరిస్థితులే నేడు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయని అన్నారు.
తన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లా తిరమలాయపాలెం మండలం మాదిరిపురం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ రాజశేఖర రెడ్డి లక్షా 43వేల కోట్లు రూపాయలు దోచుకున్నారని, ఇప్పుడు వైయస్ కుమారుడు వైయస్ జగన్ ఈ దోపిడీని కొనసాగించేందుకు జైలు నుంచే పథక రచన చేస్తున్నారని విమర్శించారు. తెరాస పనికి రాని పార్టీ అని, ఆ పార్టీ వల్ల ఒరిగేదీమీలేదని ఆయన అన్నారు.
అవినీతి సర్కారుపై ప్రజలు, యువత.. బొబ్బలిపులులై, కొండవీటి సింహాలై తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ సక్రమంగా లేనప్పుడు బిల్లులెందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతవరకు ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా పాదయాత్ర చేయగలనన్నారు. 1600 కిలోమీటర్ల పాదయాత్రలో దారిపొడవునా రైతులు, పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, ఆ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ప్రజలు గుర్తించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications