జగన్ బయటికి వస్తాడు: విజయమ్మ, బాబుపై నిప్పులు
తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని ఆమె విమర్శించారు. చంద్రబాబు పాలనలో కరెంట్ చార్జీలు వంద శాతం పెంచితే, వైయస్ మరణం తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతోందని ఆమె అన్నారు.
ప్రజాసమస్యలను పట్టించుకోకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు వాగ్దానాలను నిలబెట్టుకున్న చరిత్ర లేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు అంతటి చరిత్రహీనుడు ఎవరూ లేరని, వైయస్ పథకాలనే తాను ఇస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, అందుకు బదులుగా రాజన్న రాజ్యం తెస్తానని చెప్తే బాగుంటుందని ఆమె అన్నారు.
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. వస్తున్నా మీ కోసం అంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై చేతనైతే అవిశ్వాసం పెట్టాలన్నారు. కుట్ర పన్ని జగన్ను జైలులో పెట్టారని, ప్రజలు మాత్రం కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ఆయన నిర్దోషి అని స్పష్టం చేశారని చెప్పారు.
త్వరలోనే జగన్ బయటికివచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.