రూపాయికే ఇడ్లీ, పెరుగన్నం రూ3: జయలలిత కొత్తస్కీం

రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు సాంబారన్నం, మూడు రూపాయలకే పెరుగన్నం. ఇలా మెనూ ఉంటుంది. ఎక్కడ చూసినా రూ.12లోపు అల్పాహారం కూడా దొరకని ఈ రోజుల్లో పేదలు, కార్మికుల ఆకలి తీర్చడానికి చెన్నై నగర పాలక సంస్థ చేసిన ప్రయత్నం ఇది. తొలి దశలో నగరంలోని ప్రతీ వార్డు పరిధిలో ఒకటి ప్రారంభించేందుకు నగర పాలక సంస్థ సమాయత్తం అవుతోంది. ఈ విధంగా తొలిదశలో మొత్తం 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ క్యాంటీన్లలో ఇడ్లీ ఒక రూపాయికి, సాంబర్ అన్నం ఐదు రూపాయలకు, పెరుగు అన్నం మూడు రూపాయలకు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరకే కదా అని క్వాలిటీలోనూ తక్కువ లేదు. పరిశుభ్రత, రుచికరమైన అల్పాహార పదార్థాల తయారీ, విక్రయాల పర్యవేక్షణ పనులు కార్పోరేషన్ నిర్వహించనుంది.
"సరైన సమయంలో సరిపడ మోతాదులో పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగాలంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి కూడా మంచి ఆహారం అందాలి. గుడిసెల్లో నివసించే వారిలో అధికశాతం మంది రోజువారీ వేతన కూలీలు, డ్రైవర్లు, బరువులు మోసేవారే. వీరితోపాటు పనుల కోసం నగరానికి వచ్చేవారికి తక్కువ ధరల్లో చక్కటి ఆహారం అందించాలన్న యోచనతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం'' అంటూ నగరపాలక సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇంత తక్కువ ధరల్లో ఆహార పదార్థాలు అందిచడం కోసం.. 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేజీ రూపాయికే తమిళనాడు పౌరసరఫరాల విభాగం నుంచి చెన్నై నగరపాలక సంస్థ పొందనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆమోదం తెలిపారు. ఈ క్యాంటీన్ల పర్యవేక్షణను నగరపాలక సంస్థకు చెందిన సంక్షేమ అధికారి చూడనున్నారు. చిత్తశుద్ధితో నిర్వహించాలే కానీ నిజంగా ఇది పేదల కడుపు నింపే కార్యక్రమమే అవుతుందనడంలో సందేహమే లేదు.












Click it and Unblock the Notifications