సభలో బిల్లు పెడితే మద్దతు: తెలంగాణపై మాయావతి

తెలంగాణ ఇస్తారనే నమ్మకముంది
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని మంత్రి సునిత లక్ష్మా రెడ్డి హైదరాబాదులో అన్నారు. సీమాంధ్ర నేతలు హఠాత్తుగా ఈ నెల 17న సమావేశాలు పెట్టుకుంటాన్నారని, దానిని బట్టే తెలంగాణ ఇస్తుందని తమకు అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ, కేంద్రం గుర్తించిందన్నారు. అందరం కలిసి తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.
సమైక్యమే మా నినాదం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ప్రధాన అజెండా అని మంత్రి శైలజానాథ్ మంగళవారం వేరుగా హైదరాబాదులో అన్నారు. అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై తమకు ఎలాంటి సంకేతాలు లేవన్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోందన్నారు.
హోంశాఖ ముందు శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు ఉన్నాయని మాత్రమే తమకు తెలుసునన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందన్నారు. ఈ నెల 17వ తేదిన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సమావేశం కానున్నట్లు చెప్పారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ సమావేశం ఉంటుందన్నారు. దీనికి సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ వస్తారన్నారు.
శైలజానాథ్ సమావేశానికి ఆనం
మంత్రి శైలజానాథ్ ఏర్పాటు చేసే సమావేశానికి తాము హాజరవుతామని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సమైక్యవాదంపై ఆలోచనలు, ప్రజల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడంలో తప్పులేదన్నారు. ప్రతికూల నిర్ణయం వస్తే రాజీనామా చేస్తానన్న మంత్రుల అభిప్రాయం వారి వ్యక్తిగతమన్నారు. తాము కేంద్రం, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆనం చెప్పారు.
20న హైదరాబాదులో సమైక్య సభ
ఈ నెల 20వ తేదిన హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో సమైక్యాంధ్రకు అనుకూలంగా సభను నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జెఏసి కన్వీనర్ కిషోర్ కుమార్ చెప్పారు. ప్రాణత్యాగాలు చేసైనా సమైక్యాంధ్రను కాపాడుకుంటామన్నారు. సీమాంద్ర నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయకపోతే వారిని ద్రోహులుగా గుర్తిస్తామన్నారు. కేంద్రం నిర్ణయం సమైక్యానికి వ్యతిరేకంగా ఉంటే నేతలు అందరూ ముందుకు రావాలన్నారు. మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబులు పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకని సీమాంధ్ర నేతలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామన్నారు.
ఇబ్బందులు తేవద్దు
తెలంగాణ సమస్యపై అధిష్టానం, కేంద్రం పరిష్కార దిశగా ఆలోచిస్తున్న సమయంలో ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. ఇరు ప్రాంతాల నేతలు సభలు, సమావేశాలు అంటూ ఇబ్బందిరక పరిస్థితులు తీసుకు రావొద్దన్నారు.












Click it and Unblock the Notifications