తెలంగాణను ముందుకు తెచ్చారు: వైయస్పై విహెచ్
కాంగ్రెసును విమర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన తమ పార్టీ సీమాంధ్ర నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరూ అడ్డు పడవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
తెలంగాణ జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం ఏమిటో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తాము 15 పార్లమెంటు సీట్లలో కాంగ్రెసును గెలిపిస్తామని ఆయన చెప్పారు. 1972 తర్వాత చాలా రాష్ట్రాల్లో మార్పు వచ్చిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకు్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ తీసేందుకు ఆనాడు తెలంగాణ అంశాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకుల కొడుకులు జగన్ పార్టీలో ఉన్నారని, కొడుకులను కూడా పార్టీ వైపు ఉంచలేని నాయకులు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విహెచ్ వ్యాఖ్యానించారు. ఎంత మంది సీమాంధ్ర నాయకుల కొడుకులు అటు వెళ్లారో చెప్పాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీల నేతలంతా కట్టుబడి ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. సీమాంధ్ర నేతలు హైదరాబాదులో సమావేశం పెట్టుకోవడంలో తప్పు లేదని, ప్రజాస్వామ్యంలో వారి వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉంటుందని ఆయన గురువారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సీమాంధ్ర నేతలు అధిష్టానానికి తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చునని కూడా ఆయన అన్నారు.