పొత్తు: వన్సైడ్ లవ్వన్న జగన్పార్టీ, తప్పులేదన్నబొత్స
వచ్చే ఎన్నికల్లో యూపిఏకి 100 లోక్సభ స్థానాలు కూడా రావని మైసూరా అన్నారు. ఎన్నికల తర్వాత లౌకికవాద పార్టీలతో పొత్తు ఉంటుందని తమ పార్టీ అధినేత ఇదివరకే ప్రకటించారన్నారు. యూపిఏ, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా మరోఫ్రంట్ ఏర్పాటు కావచ్చని, ఎవరైనా ప్రధాని కావచ్చన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూశాక అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెసుది వన్ సైడ్ లవ్ స్టోరీ అని, ఆ పార్టీకి వయసు అయిపోయిందని, జగన్ యువకుడు అని, ఆయన అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. ఢిల్లీ నాయకుల ఆదేశాలను ఇక్కడి అమలుకు గవర్నర్ నరసింహన్ వాచ్ డాగ్లా వ్యవహరిస్తారే తప్ప, ఇక్కడి సమస్యలు ఆయనకు ఎందుకు పడతాయని వ్యాఖ్యానించారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ పార్టీ 200 అసెంబ్లీ, 35 లోక్సభ స్థానాలు గెలుస్తుందని మేకపాటి అన్నారు. 35 ఎంపీ స్థానాలంటే, ప్రస్తుత యూపిఏలోని మూడు, నాలుగు పార్టీల బలంతో సమానమన్నారు. జగన్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో లౌకికపార్టీల కూటమిలో తమ పార్టీ చేరడానికి సిద్ధమని తెలిపారు. చంద్రబాబు నీతి గురించి మాట్లాడటం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీతో పొత్తుపై జైపూర్లో వాయలార్ రవి చేసిన వ్యాఖ్యలపై జగన్ పార్టీ స్పందించింది.
తప్పులేదన్న బొత్స
జగన్ పార్టీతో పొత్తు పెట్టుకునే వ్యవహారాన్ని రాష్ట్ర పార్టీయే చూసుకుంటుందని వయలార్ రవి చెప్పడంలో తప్పులేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారని, తమకు బాధ్యత అప్పగించినప్పు డు దానిపై ఆలోచిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు, సోనియా నాయకత్వం పట్ల ఆకర్షితులై కలిసొచ్చేవారితో పొత్తులు ఉంటాయన్నారు. అంతేతప్ప అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అర్రులు చాచి అడ్డదారులు తొక్కదన్నారు. తెలంగాణ, జగన్ అంశాలపై పార్టీ వైఖరే తమకు ముఖ్యమన్నారు.