అయ్యన్నకు బాబు బుజ్జగింపులు: పలకరించిన సుజనా!
పార్టీ ఎంపీ సుజనా చౌదరి అయ్యన్నతో ఫోన్లో మంతనాలు జరిపారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పార్టీలోని సమస్య సమసిపోయినట్లేనని చెప్పారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా అయ్యన్న ఇప్పుడు అసంతృప్తితో లేరన్నారు. పార్టీ నేతలు దాడి వీరభద్ర రావు, రత్నాకర్, ఎమ్మెల్యే రాజులు మచిలీపట్నంలో అయ్యన్నపాత్రుడితో భేటీ అయి బుజ్జగింపులు చేపట్టాయి. వారి బుజ్జగింపులతో ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే షీలాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరే అవకాశం ఉంది.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి శనివారం ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాసరావును సస్పెన్షన్ను తప్పు పడుతూ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. ఆయన తన పోలిట్బ్యూరో సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన అసంతృప్తిని అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారు. తాను పార్టీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన చెప్పారు. జీవితాంతం పార్టీతోనే ఉంటానని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన సంఘటనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిదే తప్పు అని, ఎన్టీఆర్ విగ్రహానికి బండారు సత్యనారాయణ మూర్తి దొంగ చాటుగా దండ వేశారని ఆయన వ్యాఖ్యానించారు.
సంజాయిషీ కోరకుండా, విచారణ జరపకుండా పీలా శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్పు అని అయ్యన్న పాత్రుడు అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం మంచిదని భావించేవారు తనను అనుసరిస్తారని ఆయన చెప్పారు. బండారు సత్యనారాయణమూర్తి వ్యవహారాన్ని తాము జిల్లా ఇంచార్జీకి చెప్పుకున్నామని, చంద్రబాబు పాదయాత్రలో ఉన్నందు వల్ల వ్యవహారాన్ని జిల్లా ఇంచార్జీకి చెప్పామని ఆయన అన్నారు.
ఏకపక్షంగా సస్పెండ్ చేయడం కొత్త ధోరణిగా కనిపిస్తోందని, ఇటువంటి ధోరణితో తాము పార్టీలో కొనసాగలేమని అయ్యన్నపాత్రుడు అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై పీలా వర్గీయులు దాడి చేశారనే ఆరోపణలు రావడంతో చంద్రబాబు నాయుడు పీలా శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది.