రాష్ట్రానిదే: జగన్తో పొత్తుపై వాయలార్, తెలంగాణపై నో
మేధో మథనంలో కొత్త పొత్తులపై దృష్టి సారించాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జతకట్టే విషయంపై మాట్లాడుతూ... ఆ విషయం తనకు తెలియదని, జగన్ కొన్ని నెలల కిందటే కాంగ్రెస్ను వదిలి బయటకు వెళ్లారని, అందువల్ల, ఆయన పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ నాయకులే చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలన్నారు.
బార్కిస్ (ఛార్లెస్ డికెన్స్ నాటకంలో ఓ పాత్ర) పెళ్లికి సిద్ధం అంటే.. ఎవర్ని పడితే వారిని చేసుకోవడానికి సిద్ధం కాదంటూ ఎవరితో పడితే వారితో పొత్తులు ఉండవని వ్యాఖ్యానించారు. అలాగే, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితిని బట్టి ఏదైనా జరుగుతుందన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ 1960 నుంచి పొత్తులు పెట్టుకుంటోందని, ఇప్పటికీ యుటిఎఫ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా అధికారాన్ని చేపట్టలేనప్పుడు రాజకీయ పరిస్థితిని బట్టి భావసారూప్యతగల పార్టీలను కలుపుకొని ముందుకెళ్లాలన్నది తమ సిద్ధాంతమన్నారు. ఉత్తర భారతంలో తమ ప్రత్యర్థి బిజెపి అని, దానిని ఓడించేందుకు తాము పొత్తులు పెట్టుకోక తప్పదని వయలార్ అన్నారు. దక్షిణాదిలో వివిధ ప్రాంతీయ పార్టీలు తమకు ప్రత్యర్థులుగా ఉన్నాయని, అది కూడా తాము పొత్తులు పెట్టుకునే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు చేజారుతోందని సోనియా ప్రస్తావించినందునే, మేధోమథనంలో ఆ అంశంపై చర్చిస్తున్నామన్నారు. కొత్త మిత్రులను వెతుక్కోవటం, పొత్తులు పెట్టుకోవటం, ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఎన్నికను ఎదుర్కోవటం కాంగ్రెస్ పార్టీకి కష్టమేమీ కాదన్నారు. ఇది రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మారుతుందన్నారు. ప్రస్తుతానికి ఈ విధానం రాష్ట్రాలకే పరిమితమని, 2014 ఎన్నికల్లో కొత్త మిత్రులను వెదుక్కునే అంశం గురించి తర్వాత చర్చిస్తామన్నారు.
తెలంగాణపై శనివారం మధ్యాహ్నం వరకూ ఎలాంటి చర్చా జరగలేదన్నారు. చిన్న రాష్ట్రాలపై చర్చ జరుగుతుందా, లేదా అనే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. అసలు ఇలాంటి చర్చ జరుగుతోందని ఎవరు చెప్పారని వాయలార్ రవి మీడియాను ఎదురు ప్రశ్నించారు.