బాబును అడ్డుకోం, పూలతో ఘన స్వాగతం: లగడపాటి
ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడారు. ఈ నెల 21వ జిల్లాలోకి ప్రవేశిస్తున్న చంద్రబాబును తాము అడ్డుకోమన్నారు. ఆయనకు కనువిప్పు కార్యక్రమంతో ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. బాబుకు పూలతో స్వాగతం పలుకుతామన్నారు. రాష్ట్రానికి పెనుముప్పు ఉంది. కాబట్టే తాము కనువిప్పు యాత్రను చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమైక్యవాద పార్టీలు 270 సీట్లను గెలుచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరూ ఒకటే అన్నారు. బాబును తాను కలిసి సమైక్యవాదంపై కనువిప్పు కలిగిస్తానన్నారు. సమైక్యవాదం సీమాంధ్ర ప్రజల గుండెలోతుల్లో ఉందన్నారు. ఇప్పుడు అది కట్టలు తెంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా లగడపాటితో సహా అక్కడున్న వారంతా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
రాహుల్ సౌమ్యుడు
ఏఐసిసి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాహుల్ గాంధీ సౌమ్యుడు, మితభాషి, నిగర్వి అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. 2004 నుండి ఇప్పటి వరకు ఆయన రాజకీయాల్లో అనుభవం సాధించారన్నారు. కార్యకర్త నుండి నేతల వరకు అందరినీ ఆయన సమాన దృష్టితో చూస్తారన్నారు. ఫోటోలు దిగినప్పుడు కూడా రాహుల్ అందరితో పాటు నిలుచుంటారని, తనకు ప్రత్యేకత కోరుకోరన్నారు. అందరిలో ఒకడిగా కలిసిపోతారన్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారన్నారు.