కఠిననిర్ణయాలు తప్పవు, అవినీతి చేస్తే అంతే: సోనియా
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు, మహిళలకు భద్రతపై కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మహిళా బిల్లును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల మహిళల ప్రాధాన్యత పెరిగిందన్నారు. మహిళా సంక్షేమం, వారి భద్రత ముఖ్యమైన అంశాలు అన్నారు.
సామాన్యుల సంక్షేమానికి పార్టీ కృషి చేస్తోందన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదన్నారు. టిక్కెట్లు కోరే వారే ఓటమికి బాధ్యత వహించాలన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొత్తరకం నాయకత్వానికి యువతను ముందుకు తీసుకు రావాలన్నారు. సోషల్ మీడియాను రాజకీయంగా వినియోగించుకోవాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దేశ సమగ్రతకు కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచుతామన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళుతోందన్నారు. నగదు బదలీ పథకం దళారుల అవినీతిని నిర్మూలిస్తుందన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. యువత జైపూర్ సదస్సులో ఎక్కువ మంది పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పరిస్థితులను బట్టి కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.
హామీలు నెరవేర్చాలి: ప్రధాని
యుపిఏ హయాంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. 2004, 2009 ఎన్నికల హామీలను నెరవేర్చామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ధనిక, పేద తారతమ్యాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలికా రంగాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.