ఆంధ్రలోకి బాబు: తాకని సమైక్య సెగ, లగడపాటి సీనే
తెలంగాణ అనుకూల వైఖరి కారణంగా చంద్రబాబుకు ఆంధ్రలో వ్యతిరేకత ఎదురవుతుందనే ప్రచారం కొద్ది కాలంగా సాగుతూ వచ్చింది. అయితే, ఆయనకు ప్రజల నుంచి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడలేదు. తెలంగాణలోని 9 జిల్లాల్లో పాదయాత్రను ముగించి ఆయన ఆంధ్రప్రాంతంలోకి ప్రవేశించారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెండు కిలోమీటర్ల తర్వాత గరికపాడు చెక్పోస్టు వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో చంద్రబాబుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన పాదయాత్రలో జిల్లా పార్టీ నేతలతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వ చంద్రబాబు "వస్తున్నా..మీకోసం" పాదయాత్ర 112 వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బాబుతో జిల్లా తెలుగుదేశం కార్యవర్గం భేటీ అయింది.
పాదయాత్రకు రాష్ట్రం నలుమూలలా మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసారు. పాదయాత్రను కొనసాగించాలనుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. సహకార ఎన్నికల్లో సత్తా చూపాలని, ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, వల్లభనేని వంశీలతో పాటు కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పెద్ద యెత్తున స్వాగతం చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చంద్రబాబు కృష్ణా జిల్లాలో ప్రవేశించారు.