త్వరగా తేల్చాలి లేదా..: తెలంగాణపై సోనియా ఆలోచన

నిర్ణయం ప్రకటించడానికి కొంత వెసులుబాటు తీసుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరలోనే విషయం తేల్చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేకపోతే ఆ విషయాన్నే స్పష్టం చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రకటన చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ముసుగులో గుద్దులాటలు వద్దని పార్టీ అధ్యక్షురాలు స్పష్టం చేశారట.
సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, మంత్రులు షిండే, చిదంబరం, ఆంటోనీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, పార్టీ పరిశీలకుడు వయలార్ రవిలతో సోనియా గురువారంసమావేశమయ్యారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. తదుపరి చర్యలపై నేతల మధ్య రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని తెలిసింది.
ఫిబ్రవరి మూడో వారంలో జరిగే బడ్జెట్ సమావేశాలలోపు నిర్ణయం తీసుకోవాలని కొందరు, ఆ తర్వాత తీసుకోవచ్చని మరికొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. సోనియా మాత్రం మరీ దీర్ఘకాలం ఈ సమస్యను నాన్చడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, ప్రజల మధ్య వైమనస్యాలు తలెత్తుతాయని పేర్కొన్నట్లు తెలిసింది. నిర్ణయం ప్రకటించేముందు రాష్ట్రంలో రాజకీయ మార్పులు చేపట్టాలా లేదా అన్న విషయంపై కూడా తర్జన భర్జనలు జరిగినట్లు తెలిసింది.
తెలంగాణ సమస్యకు గూర్ఖాలాండ్ తరహాలో ప్రాదేశిక మండలి గానీ, చండీగఢ్ తరహాలో ఉమ్మడి రాజధాని ఫార్ములాగానీ పని చేయవని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వడమా... లేక తెలంగాణకు ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమా? ఈ రెండు అంశాలపైనే కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications