తెలంగాణ: 'జగన్'తో కెవిపి హైడ్రామా! ఐనా చిన్న ఆశ
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం వెనక్కి వెళ్లడం వెనుక కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు హస్తం ఉందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్లు కెవిపి కుట్ర చేసి తెలంగాణపై ప్రకటన రాకుండా అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన జరగకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని కాంగ్రెసులో విలీనం చేయించడం కుదరకపోతే, 2014లో యుపిఏకు మద్దతు ప్రకటించే అంశంపై కెవిపి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకే కేంద్రం తెలంగాణ ప్రకటనపై వెనక్కి పోయిందని అంటున్నారు. తెరాస, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసుల కారణంగా తెలంగాణ ప్రకటించినా ఆ ప్రాంతంలో కాంగ్రెసు ఎక్కువ సీట్లు గెలవలేదనే వాదనను అధిష్టానం ముందు సీమాంద్ర నేతలు ఉంచారట. దీంతో వెనక్కి తగ్గిందని భావిస్తున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి వైయస్ జగన్ సాకు చూపి కెవిపి రామచంద్ర రావు తెలంగాణపై రావాల్సిన ప్రకటనను అడ్డుకున్నారని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు.
అధిష్టానం, కేంద్రం పెద్దల ముందు సీమాంధ్ర నేతలతో వెళ్లి కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పారని, తెలంగాణను అడ్డుకున్నారని ఎంపి మధు యాష్కీ, తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ తదితరులు ఆరోపిస్తున్నారు.
నాడు తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలంగాణ రాకుండా చేశారని, ఇప్పుడు ఆయన ఆత్మబంధువుగా ముద్రపడిన కెవిపి తెలంగాణ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణకు అడ్డుపడుతున్నారని భావిస్తున్న లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచంద్ర రావు, కావూరి సాంబశివ రావులను కోర్టుకీడ్చే పనిలో తెరాస ఉందట. వారి వ్యాపారాలు అన్ని సక్రమమైనవేనా అనే పరిశీలనలో ఆ పార్టీ లీగల్ సెల్ మునిగిపోయిందట. ప్రధానంగా కెవిపిని టార్గెట్ చేసుకుందని అంటున్నారు.
కెవిపి ఆధ్వర్యంలో ఢిల్లీలో పలువురు పెద్దలను కలిసిన సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా లాబియింగ్ చేశారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
విభజన జరగకుండా ఉంటే జగన్ పార్టీ విలీనం కానీ, మద్దతు కానీ ఉంటుందని కెవిపి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారట.
దీనికంతా కెవిపినే వ్యూహర రచన చేశారని, జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆయన ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి లీగల్ సెల్ తెలంగాణ ఏర్పాటు అడ్డుకుంటున్నారని భావిస్తున్న కెవిపి, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావులను కోర్టుకు ఈడ్చే పనిలో పడిందట. మరోవైపు కేంద్రమంద్రి గులాం నబీ ఆజాద్ నోటి నుండి తెలంగాణ వాయిదా ప్రకటన వెలువడినప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానలేదంటున్నారు.
కేంద్రం ఎక్కడ ఈ నెల 28లోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళనతో నేతలు కొందరు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రం, అధిష్టానం చర్యలను గమనిస్తున్నారు. తెలంగాణ నేతలు కొందరు ఆజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతుండగా మరికొందరు విపరీతార్థాలు వెతకవద్దని కోరుతున్నారు.
ఆజాద్ వ్యాఖ్యలు సీమాంధ్ర నేతలకు ఆనందాన్ని కలిగించినా, తెలంగాణ నేతలకు చేదు కలిగించినా.. సోనియా కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతుండటం మాత్రం, తెలంగాణవాదులకు 28లోగా తెలంగాణపై ప్రకటన వెలువడుతుందేమోననే చిన్న ఆశ కలిగిస్తోంది. 28లోగా కాకున్నా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా వెలువడినా మంచిదేనని తెలంగాణ కాంగ్రెసు నేతలు కూడా భావిస్తున్నారు.