కెసిఆర్ పెత్తనమనే టీ-నేతలు వ్యతిరేకిస్తున్నారా?
కాంగ్రెసులో తెరాస విలీనంతో ఈ వివాదం ముడిపడి ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేస్తానని కెసిఆర్ కాంగ్రెసు అధిష్టానానికి ఎప్పుడో హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు, మాజీ ఎంపి వినోద్ కుమార్ బుధవారం కూడా చెప్పారు. తమ తెరాసను విలీనం చేస్తే తమ ప్రాధాన్యం తగ్గి, కెసిఆర్ ప్రాధాన్యం పెరుగుతుందని ప్రస్తుత తెలంగాణ కాంగ్రెసు నేతలు భయపడుతున్నట్లు చెబుతున్నారు.
సీనియర్ మంత్రి కె. జానారెడ్డి కెసిఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెరాసను విలీనం చేసుకోకుండానే తెలంగాణ ఇవ్వాలని జానారెడ్డి వంటి నేతలు అధిష్టానం వద్ద చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ కాంగ్రెసు నేతగా మారిపోతే తమ స్థానాలు తగ్గుతాయని జానారెడ్డి వంటి సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే, బేషరతుగా తెరాసను తమ పార్టీలో విలీనం చేస్తారా అని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అడిగారు.
కెసిఆర్ కాంగ్రెసులోకి వస్తే ముఖ్యమంత్రి పదవి విషయంలోనే కాకుండా టికెట్ల కేటాయింపుల్లో కూడా ఆయన ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. పైగా, ప్రస్తుత శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టికెట్లు ఇవ్వాలని కెసిఆర్ షరతు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. సహజంగానే వ్యూహకర్త అయిన కెసిఆర్ దాటికి తట్టుకోవడం కష్టమని ప్రస్తుత కాంగ్రెసు సీనియర్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కెసిఆర్ కాంగ్రెసులోకి రాకూడదనే ఉద్దేశంతోనే జానారెడ్డి, మధుయాష్కీ వంటి కొంత మంది తెలంగాణ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్పై అందుకే వారు తీవ్రంగా దాడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే తెలంగాణకు చెందిన మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమాలోచనలు జరిపి, ఆ తర్వాత ఆయనతో మీడియా సమావేశం పెట్టించి, కెసిఆర్పై దాడికి పురికొల్పారని అంటున్నారు.
తెరాస విలీనంతో ప్రమేయం లేకుండానే తెలంగాణ ఇవ్వాలనే కాంగ్రెసు నేతలు చాలా మందే ఉన్నారని అంటున్నారు. కెసిఆర్ లేకున్నా తాము తెలంగాణలో నెట్టుకు రాగలమని జానారెడ్డి వంటి నాయకులు చెబుతున్నట్లు సమాచారం.