మీడియా సృష్టే: తెలంగాణపై ఢిల్లీ చర్చలపై కిరణ్ రెడ్డి

తెలంగాణపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సమాచారం తాను అందించినట్లు తెలిపారు. మిగతాది అంతా మీడియా ఊహాగానాలేనని ఆయన అన్నారు. మీడియా ఊహాగానాలు ఎలా చేస్తుందో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విషయంలో తేలిపోయిందని ఆయన బొత్సను చూపిస్తూ అన్నారు.
తెలంగాణపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే - వెంటనే నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పి వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆయన చెప్పారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శానససభ్యులు రాజీనామాలపై వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ - రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
రైతు సంక్షేమ కార్యక్రమాల కారణంగానే తాము సహకార ఎన్నికల్లో విజయం సాధించామని ఆయన చెప్పారు. తాము రైతుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. సహకార ఎన్నికల్లో విజయం వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వరికి మద్దతు ధరను 70 రూపాయలు మాత్రమే పెంచారని ఆయన అన్నారు. రైతులకు మేలు జరిగే కార్యక్రమాలను చేపట్టాం కాబట్టే తమకు మద్దతు ఇచ్చారని చెప్పానని, ఉప ఎన్నికల్లో ఆమోదం, అనామోదం గురించి మాట్లాడలేదని ఆయన అన్నారు.
రైతు రుణాలపై 1.5 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని, నాలుగు శాతం వడ్డీని ఇతర రాష్ట్రాల్లో రైతులు భరిస్తుంటే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఆయన చెప్పారు. జలయజ్ఞం ద్వారా ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించామని, 2014 చివరినాటికి మరో 30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఉగాది నుంచి బియ్యం మాత్రమే కాకుండా 9 నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications