ఎమ్మెల్యేనయ్యా, చచ్చినా బతికినా టిడిపిలోనే: ప్రభాకర్
గురువారం ఆయన హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తాను తన నియోజకవర్గంలో ఎస్సైపై దాడి చేసినట్లు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టారని, ఈ ఘటనలో నిజంగా ఏం జరిగిందో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరానని చెప్పారు. సిఎంకు అన్ని వివరాలను అందజేశానని చెప్పారు. తాను స్పీకర్ను కలిసేందుకే శాసనసభకు వచ్చానని చెప్పారు.
సహకార ఎన్నికల్లో మరో పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు పోలీసులు తనపై కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలను ఆన కొట్టిపారేశారు. ప్యాకేజీల కోసం మరో పార్టీలోకి వెళ్లనని, చచ్చినా, బతికినా తెలుగుదేశంలోనే ఉంటానని, కార్యకర్తగా ఉన్న తనను పార్టీ ఎమ్మెల్యేని చేసిందన్నారు. రాజకీయాలు చేయకపోతే పార్టీ అధ్యక్షుడికి చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.
కాగా తనపై నమోదైన కేసుల విషయంలో పార్టీ అధిష్టానం, జిల్లా పార్టీ నేతలు స్పందించడం లేదని భావిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలక వహించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ తన విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలొచ్చాయి. వీటిని ఆయన ఖండించారు.