జబ్బలు చర్చుకోకుండా: జగన్పార్టీకి పయ్యావుల సవాల్

ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడారు. సరైన సమయం చూసి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చంద్రబాబు చెప్పారన్నారు. అంతకుముందు కావాలంటే జగన్ పార్టీ నేతలు మద్దతిచ్చే వారితో కలిసి వెళ్లి అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేశారు. జబ్బలు చర్చుకోవడం కంటే అలా చేస్తే మంచిదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.
మంత్రి కాలేని వారు ముఖ్యమంత్రి అయితే రైతులను అధైర్య పరిచే మాటలే మాట్లాడుతారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఒక్కరోజైనా కిరణ్ రైతు భుజం మీద చేయి వేసి నడిచారా? అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాల మాఫీ సాధ్యం కాదంటూ సిఎం ప్రకటించడం సరికాదన్నారు. రైతు వ్యతిరేక విధానాల పైన తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందని చెప్పారు.
కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటిసిని ఎంబిఎస్ జువెలర్స్ సంస్థ వందల కోట్ల మేర ముంచిన వ్యవహారంలో జగన్ పాత్ర ఉందని టిడిపి ఉపనేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు గురువారం ఆరోపించారు. ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, తంగిరాల ప్రభాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంబిఎస్ యజమానులైన గుప్తా సోదరులు జగన్కు బినామీలని తెలిపారు. బంగారం గోల్మాల్ వ్యవహారంలో గుప్తా సోదరులకు, జగన్కు మధ్య నెలకొన్న సంబంధాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో వైయస్ దారిలోనే కిరణ్ నడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications