వైయస్ మాట నమ్మి.., నేను అలా అనలేదు: బాబు
పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో ఆయన అంగలకుదురులో ఎన్టీఆర్ కిసాన్ భవన్కు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్ల కాంగ్రెసు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్లలో అది మరింత ఎక్కువ ఉందన్నారు.
నాటి వైయస్ మాటలు నమ్మి రైతులు ఇబ్బందుల్లో పడ్డారన్నారు. వైయస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారని ఆరోపించారు. తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానన్నారు. వైయస్ తన హయాంలో ప్రజల డబ్బును నిండా దోచుకున్నారన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు.
పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని ప్రశ్నించారు. కష్టపడి ఇచ్చిన హామీలను తాము అధికారంలోకి వస్తే నెరవేరుస్తామన్నారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. తాను దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి వ్యవసాయం లాభసాటిగా మార్చాలని చూశానన్నారు.
కాగా తెనాలిలో భారీ వర్షం కారణంగా బాబు యాత్రకు అంతరాయం కలిగింది.