ఎర్రబెల్లి సోదరుడి కొత్త పార్టీ: షర్మిలపై విహెచ్ నిప్పులు
జెండాలు పక్కన పెట్టాలి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా మండిపడ్డారు. కెసిఆర్కు తెలంగాణ రావడం ఇష్టం లేదన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాటను తప్పుతోందని ఆరోపించారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు జెండాలు పక్కన పెట్టి పోరాడాలని సూచించారు. తెలంగాణ సాధించాలంటే వంద సీట్లు కావాలని చెబుతున్న కెసిఆర్ ఆ సీట్లు వచ్చాక పార్టీని కాంగ్రెసుకు అమ్ముకోవడం ఖాయమని ఆరోపించారు. నాగం జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం సరికాదన్నారు. అయితే, తెలంగాణ పట్ల ఆయన చిత్తశుద్ధిని ఎవరు శంకించరన్నారు.
షర్మిలపై విహెచ్ నిప్పులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం హైదరాబాదులో మండిపడ్డారు. తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించే నైతిక హక్కు షర్మిలకు లేదన్నారు. నిత్యం ప్రజా సంక్షేం గురించి ఆలోచించే తమ పార్టీ ముఖ్య నేతలను ఏమైనా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా విహెచ్ సూచనలు చేశారు. నేతలు ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజల్లో తిరగాలను సూచించారు. చంద్రబాబు, షర్మిల వలే నేతలు ప్రజల్లో తిరుగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడుతోందన్నారు. బొత్స, కిరణ్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీపై ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన పార్టీ, రాజకీయాలు తెలియని షర్మిల ప్రజల్లో తిరుగుతున్నారని బొత్స, కిరణ్లకు గుర్తు చేశారు. రాహుల్ రాష్ట్ర పర్యటన కంటే ముందుగానే పార్టీని బలోపేతం చేయాలన్నారు.