NDA: ఎన్డీయేకు తమిళనాడులో షాక్..! ఆ పార్టీ గుడ్ బై..!
తమిళనాడులో గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న పార్టీల్ని సైతం కకావికలు చేస్తున్నాయి. ముఖ్యంగా తమ రాజకీయాన్ని మార్చుకోవాల్సిన అవసరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష ఎన్డీయే (NDA) కూటమికి ఇవాళ ఓ భాగస్వామ్య పార్టీ గుడ్ బై చెప్పేసింది. దీంతో తమిళనాడులో ఎన్నికల తర్వాత ఎన్డీయేకు తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
తమిళనాడులో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) టీఎంసీ (Tamil Maanila Congress) ఇవాళ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తమ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించే ఉద్దేశంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి వైదొలగాలని నిర్ణయించింది. చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత టీఎంసీ నేత జి.కె. వాసన్ ఈ విషయాన్ని ప్రకటించారు.

అయితే, బీజేపీ, అన్నాడీఎంకే లేదా ఎన్డీయేలోని ఇతర మిత్రపక్షాలతో తమ పార్టీకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు తక్కువగా ఉంటాయని, ఒక రాజకీయ ఉద్యమంగా టీఎంసీ ఎదగాలంటే మాత్రం స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, ఎన్నికల కోసం పొత్తు అవసరమని కూడా వాసన్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తమిళనాడులో తమ పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే కూటమి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిందని మాజీ కేంద్ర మంత్రి అంగీకరించారు.














Click it and Unblock the Notifications