జగన్ బయటకొచ్చి... లేదంటే విజయమ్మ: జూపూడి
అవసరమైతే వైయస్ విజయమ్మ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రంలో వైయస్ పాలన తీసుకు వస్తామన్నారు. వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వస్తున్నారని చెప్పారు.
కొత్తగా చేరుతున్న వారి వల్ల ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న వారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. పదవి ఉంటేనే పార్టీలో ఉంటామనే బ్యాచ్లు కొత్త చేరికల వల్ల ఇబ్బంది కలుగుతుందని అక్కడక్కడ మాట్లాడుతుండవచ్చునని, పార్టీ అధికారంలోకి వస్తే ఐదువేల పదవులు అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పుడు వారిని అందులో సర్దుబాటు చేస్తారని చెప్పారు. ఇక ప్రజా సేవ కోసం వచ్చిన వారైతే నిశ్చింతగా పని చేసుకోవచ్చునని సూచించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం చేరుకునే నాటికి ఆయనను స్వాగతించటానికి ఆ పార్టీలో ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తే, అసలు పార్టీ నుంచి ఎందరు వెళ్లారో తెలియక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తొమ్మిది మంది వెళ్లారని చెబుతున్నారన్నారు.