మిస్టరీగా మారిన సీరియల్ హత్యలు: మరో శవం

నల్లగొండలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు దారుణహత్యకు గరయ్యారు. ద్విచక్రవాహనంపై పయనిస్తున్న వారిని ప్రత్యర్థులు కారులో వెంటాడి హతమార్చారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్ ఎల్బీనగర్ గుంటి జంగమయ్య కాలనీకి చెందిన వంగూరి మహేష్ (26) కాగా మరొకరు పీఏ పల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన భాషాపాక వేణు (27). వారు హత్యకు గురైన చోటనే నర్సయ్య అనే వ్యక్తి మృతదేహం కూడా కనిపించింది.
వివరాలు ఇలా ఉన్నాయి - వంగూరి మహేష్, వేణు హీరోహోండాపై వెళుతుండగా తెల్ల టాటా ఇండికా కారులో గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి నల్లగొండ సమీప పానగల్ ఉదయసముద్రం ప్రాజెక్టు వద్దకు వచ్చేసరికి మోటార్సైకిల్ను ఢీ కొట్టారు. అదుపుతప్పి కిందపడగానే కారులోంచి దిగిన నిందితులు వెంట తెచ్చుకున్న కారంపొడి వీరిపై చల్లి మహేష్పై కత్తులు, గొడ్డళ్లతో తలపై ఇష్టమొచ్చినట్టు బాదారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. తేరుకున్న వేణు ప్రాణభయంతో పరుగు తీశాడు. అయితే అర కిలోమీటరు దూరం వరకు నిందితులు అతడిని వెంటాడి రాములబండ గ్రామ సమీపంలోని పత్తి చేలో నరికి చంపారు. అనంతరం అదే కారులో వారు నకిరేకల్ వైపు పరారయ్యారు. కారులో మొత్తం అయిదుగురున్నట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
హత్యా స్థలంలో పోలీసులకు దొరికిన రెండు సెల్ ఫోన్లలో ఒకటి తుంగతుర్తికి చెందిన ఇసరం నర్సయ్య అలియాస్ భరత్దిగా గుర్తించారు. నర్సయ్య మృతదేహమే శనివారం బయటపడింది. మోటార్సైకి ల్ కూడా నర్సయ్యదే. బాషపాక వేణు 2007 లో తుంగతుర్తిలో ఓ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి ని పాతకక్షలతో హత్యచేశారని భావించినా, మహేష్ను ఎందుకు టార్గట్ చేశారన్నది అంతుబట్టడం లేదు.
హత్యలు జరిగిన ప్రదేశాన్ని అదనపు ఎస్పీ ఎన్.సిద్దయ్య, ట్రైనీ ఏఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి, టుటౌన్ సీఐ మనోహర్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ బాషా సందర్శించారు. టు టౌన్ సీఐ మనోహర్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ రిఫ్రజంటేటివ్ హత్య కు గురయ్యాడని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ రావడంతో స్థానిక రిప్రజంటేటివ్లో పెద్ద సంఖ్యలో హత్య జరిగిన ప్రదేశానికి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చారు.












Click it and Unblock the Notifications