కిరణ్, బొత్స వేర్వేరు లిస్ట్: వారు హ్యాండ్, ఐదింటికే ఛాన్స్
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు శాసన మండలి స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తాయి. కానీ, ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన పది ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని పాలక పక్షం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా చూస్తే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఆరో స్థానమూ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఇందుకు అధికారపక్షం ముఖ్యంగా కిరణ్ సాహసించే పరిస్థితి కన్పించడం లేదు.
గతంలో తొలిసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానాన్ని అధికంగా గెలుచుకోవడంలో అప్పట్లో చీఫ్ విప్గా కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు సిఎంగా ఉన్న ఆయనే ఆరో స్థానం విషయంలో వెనకాడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పేర్ని నాని, బూచేపల్లి శివప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ పార్టీని వీడారు. అంతకు ముందు సుజయ రంగారావు, అళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మద్దాల రాజేశ్ పార్టీకి దూరమయ్యారు.
మరో ముగ్గురు నలుగురు ఇదే బాటలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కిరణ్పై ఆగ్రహంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, రామచంద్రయ్యకు కిరణ్తో పొసగడం లేదు. అందుకే ఐదు స్థానాలకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట.
మరోవైపు బొత్స తాజా ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న వారి జాబితాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్కు అందించారట. సిఎం కూడా తన జాబితాను సిద్ధం చేసుకున్నారట. 8, 9 తేదీల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులతో కూడిన ఉమ్మడి జాబితాతో ఢిల్లీకి రావాలని కిరణ్, బొత్సలను ఆజాద్ కోరినట్లు తెలిసింది. ఇప్పటికే ఎవరికి వారు అభ్యర్థుల జాబితాను తయారు చేసుకోవడంతో ఉమ్మడి జాబితాకు ఆస్కారం లేదని చెబుతున్నారు.