జగన్ వ్యూహం: అవిశ్వాసంతో కిరణ్, బాబులకు చిక్కులు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ వస్తున్నామని, చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించకపోతే తాము ప్రతిపాదించడానికి ముందుకు వస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న అపవిత్రమైన అవగాహనను బట్టబయలు చేయడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించదలుచుకున్నట్లు వారు చెబుతున్నారు.
విద్యుత్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీని తాము డిమాండ్ చేస్తామని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని, తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించకపోతే తాము ప్రతిపాదించే ఆలోచన చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుతం 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే కనీసం 30 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే తమకు అంతకన్నా ఎక్కువ బలం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి వంటి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారు.