మూణ్నెళ్లలో బయటకు వస్తా: మక్బూల్ వ్యాఖ్య
తమ కస్టడీ ముగియడంతో మక్బూల్ను ఎన్ఐఎ మంగళవారంనాడు పాటియాలా కోర్టులో హాజరు పరిచింది. ఈ సమయంలో ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు జర్నలిస్టులను చూసి అతను పలకరించాడు. మీడియాను చూసి అతను కేకలేశాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని జర్నలిస్టులను అతను అడిగాడు. తాము హైదరాబాద్ నుంచి వచ్చామని, ఇక్కడే బాధ్యతలు నిర్వహిస్తామని వారు చెప్పారు.
మూడు నెలల్లో తాను బయటకు వస్తానని తెలుగులో అతను చెప్పాడు. కోర్టు ఆవరణలో అతను నవ్వుతూ కనిపించాడు. కోర్టు నుంచి బయటకు వస్తూ అతను మీడియాతో మాట్లాడాడు. హైదరాబాదుకు చెందిన మక్బూల్ పూణే బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. హైదరాబాదులో పేలుళ్లకు సంబంధించిన వివరాలను మక్బూల్ను అడిగి తెలుసుకోవడానికి ఎన్ఐఎ ప్రయత్నించింది.
తాను బాంబును పదిహేను నిమిషాల్లోనే తయారు చేయగలనని, ఇండియన్ ముజాహిదీన్కు చెందిన వారిలో చాలామంది ఈ బాంబును నిమిషాల్లో తయారు చేయగల నైపుణ్యం ఉన్న వారేనని మక్బూల్ ఎన్ఐఏకి చెప్పినట్లుగా తెలుస్తోంది. తనతోపాటు అరెస్టైన ఇమ్రాన్ కరాచీలో ఇండియన్ ముజాహిదీన్లో కీలక సభ్యుడు రియాజ్ భత్కల్తో తరుచూ ఛాటింగ్ చేసేవాడని చెప్పినట్లుగా సమాచారం.
ఆపరేషన్లో పాల్గొన్న వారు దూరంగా అజ్ఞాతంలో ఉంటారని, వాళ్ల రహస్య స్థావరాలు ఎవరికీ తెలియవని, తనను మిగిలిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలగనివ్వలేదని మక్బూల్ వివరించాడట. అందరికీ అన్ని విషయాలు తెలియనివ్వరని, తనకు ఇచ్చిన బాధ్యత మేరకు హైదరాబాదులో రెక్కీ నిర్వహించానని చెప్పాడని తెలుస్తోంది. ఇండియన్ ముజాహిదీన్కు చెందిన వారు చాలా వరకు మారు పేర్లతో ఉంటారని, ఎవరు ఎక్కడ ఉంటారో తనకు తెలియదని చెప్పినట్లుగా సమాచారం.