పోలవరం టెండర్ల స్కాంవెనుక కాంగ్రెస్ అధిష్టానం: కిషన్
విద్యుత్ కోతకు తోడు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మరికొందరు వలసల బాట పడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పోలవరం టెండర్లను ట్రాన్స్ట్రాయ్కు అప్పగించారని కిషన్ రెడ్డి అన్నారు. యూపిఏ2 ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ట్రాన్స్ట్రాయ్ బోగస్ కంపెనీ అని తేలినా టెండర్లను అప్పగించారని విమర్శించారు. పోలవరం టెండర్లపై సిబిఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అర్హత లేని ట్రాన్స్ట్రాయ్-యుఈఎస్ కంపెనీకి పోలవరం టెండర్లు కట్టబెట్టడం వెనుక కాంగ్రెసు అధిష్టానం హస్తం ఉందని ఆరోపించారు. వారు సమర్పించిన అనుభవ పత్రాలు బోగస్వని తేలిందన్నారు. రష్యాకు వెళ్లిన సాగునీటి శాఖ అధికారులకు ఈ విషయాన్ని బ్యురియా గెస్ట్రాయ్ ఫిర్యాదు చేసిందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రాత్రికి రాత్రే అర్హతలు లేని కంపెనీకి అనుమతులు కట్టబెడుతూ సంతకాలు చేయడం అవినీతికి పరాకాష్ట అన్నారు. ట్రాన్స్ట్రాయ్ని బ్లాక్ లిస్టులో పెట్టి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్పై మళ్లీ జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కెసిఆర్, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడం అంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటే తెలంగాణకే నష్టమన్నారు. తెలంగాణ ఎండిపోవాలని, తమ పార్టీ రాజకీయంగా ఎదగాలన్నదే తెరాస ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తమకు అనుకూల కంపెనీకి పోలవరం టెండర్లు దక్కలేదని ఇప్పుడు ఖరారైన టెండర్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.